శేరిలింగంపల్లి, అక్టోబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ సంస్థాగత కమిటీలపై దృష్టి సారించాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపుపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మసీదు బండ కార్యాలయంలో డివిజన్ కమిటీలు, మోర్చా కమిటీలు, బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల ఏర్పాటు, పూర్తి స్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతం దిశగా ప్రతి బూత్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం అత్యంత ప్రాధాన్యతతో జరగాలన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని, శక్తి కేంద్రాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న కేంద్ర పథకాల సమాచారాన్ని చేరవేయడం, కొత్త ఓటర్లను ఆకర్షించడం, ప్రతి డివిజన్లో సక్రమమైన సమన్వయంతో పని చేయడం అవసరమని అన్నారు. ప్రతి బాధ్యతదారుడు సమయానికి లక్ష్యాలను చేరుకోవాలని, పార్టీ విస్తరణ కోసం క్రమబద్ధమైన ప్రణాళికతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, మూల అనిల్ గౌడ్, ఉపాధ్యక్షురాలు స్రవంతి, కార్యదర్శులు దుర్గాప్రసాద్, మాణిక్ రావు, కోశాధికారి కృష్ణంరాజు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.






