చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలోని శ్రీ భవానీ శంకరాలయ 21 వ వార్షిక శివోత్సవాలు రెండవ రోజు ఘనంగా కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం సత్యసాయి అచార్యుల పరివేక్షణలో శైవ ఆగమ వేద పండితులు సుబ్రహ్మణ్యం శర్మ బృందం పర్యవేక్షణలో మంగళవారం ప్రత్యేక పూజలతో పాటు శ్రీ భవానీశంకరుల దివ్యకళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. అనంతరం స్వామివారికి అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం గజవాహన సేవలో భాగంగా చందానగర్ పురవీధుల్లో శ్రీ భవానీ శంకరులు ఊరేగారు. దారిపొడవునా భక్తులు స్వాగతం పలుకుతు స్వామివార్లను దర్శించుకున్నారు.

