శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు రాజ్యాధికారమే ముఖ్యమని, సామాజిక న్యాయమే తన ఆశయమని జయశంకర్ ఎన్నో సార్లు చెప్పారని అన్నారు. ఆయన ఆశీస్సులతో సామాజిక న్యాయం సాధించేంత వరకు బీసీలు పోరాటం చేయాలని అన్నారు. అన్ని రంగాల్లోనూ బీసీలకు సమానంగా వాటా దక్కేలా పోరాటం ఉధృతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, శేరిలింగంపల్లి ఉపాధ్యక్షుడు గోవింద్ చారి, రాజేష్, అందెల కిరణ్ యాదవ్, రఘు రాములు, కృష్ణ గౌడ్, నాయి బ్రాహ్మణ సంఘం రాజు, రజక సంఘం అశోక్, గౌడ సంఘం రాకేష్, పద్మశాలి సంఘం రాము తదితరులు పాల్గొన్నారు.






