శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (నమస్తే శేరిలింగంపల్లి): అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని BHEL లోని శేరిలింగంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పూలపల్లి వెంకటరమణ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి సమితి 2000వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ఒక ప్రత్యేక నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ సంవత్సరం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, అంతకు మించి స్థానిక యువత చర్యలు అనే నినాదంతో నిర్వహిస్తున్నారని తెలిపారు. దీని ప్రధాన ఉద్దేశ్యం యువతకు సంబంధించిన సమస్యలు, విద్య, ఉపాధి, శిక్షణ, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక రంగంతో సహా వివిధ రంగాలలో యువత ప్రాధాన్యతను గురించి తెలియజెప్పటమే అని అన్నారు. యువశక్తితోనే ఏ దేశ ప్రగతి అయినా ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మధుసూదన్ రావు, ప్రభాకర్, నర్సింహులు, విద్యార్థిని, విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






