శేరిలింగంపల్లి, మే 3 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఎస్.వీ. జీ. కళావర్షిణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్స్ అండ్ యోగా కేంద్రంతోపాటు మామ్స్ టచ్ పేరిట ఏర్పాటు చేసిన పసి పిల్లల సంరక్షణ కేంద్రాన్ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భారతీయ సంప్రదాయ కళలు మహోన్నతమైనవని, పిల్లలకు చిన్నప్పటి నుంచే సంప్రదాయ, శాస్త్రీయ నృత్యకళల్లో శిక్షణ ఇప్పించాలని సూచించారు. భారతీయ వారసత్వ సంపదలైన శాస్త్రీయ సంగీతం, నృత్యం యోగా తదితర కళలను భావితరాలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యురాలు డా. శ్రీదేవిరాగి, ఎస్వీజీ కళావర్షిణి సంస్థ వ్యవస్థాపకురాలు సంధ్యారాణి, స్థానిక నాయకులు చాంద్ పాషా, బలరామ్ యాదవ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.