మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) శేరిలింగంపల్లి మండల శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ను మంగళవారం ఆవిష్కరించారు. టీపీయూఎస్ మండల అధ్యక్షుడు ఆర్.గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, జ్ఞానేంద్ర ప్రసాద్, మియాపూర్, మాదాపూర్, కొండాపూర్ డివిజన్ల బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులు కె.రాఘవేందర్, రాధాకృష్ణ యాదవ్, రఘురాం యాదవ్, ఏబీవీపీ కూకట్ పల్లి విభాగం కన్వీనర్ సంజన్నగారి విజయ్ కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రైవేటు పాఠశాలల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ధర్నాల బాట పట్టడం విద్యారంగానికి చేటు చేస్తుందని అన్నారు. అలాగే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి వారికి వెంటనే పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.లక్ష్మీకాంతరావు, జిల్లా కార్యదర్శులు ఎం.శ్రీధర్, మహేష్ బాబు, మండల గౌరవ అధ్యక్షురాలు ఎ.సుభద్ర, మండల ప్రధాన కార్యదర్శి జె.ప్రవీణ్ కుమార్, కార్యదర్శులు రాకేష్, ఎం.నరేష్, సుధీర్, ఉపాధ్యక్షురాలు సునీత పాల్గొన్నారు.






