శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డైనమిక్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న గోశాలను బుధవారం ఉదయం హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలనీలోని ఎమినిటీస్ స్థలంలో ఏర్పాటు చేసిన ఓ గోశాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని హైడ్రా అధికారులు కూల్చివేసినట్లు కాలనీవాసులు తెలిపారు. హైడ్రా వ్యవహారాన్ని పలు హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ఓవైసీ సోదరులు చెరువు నడిబొడ్డున కళాశాల నిర్మించుకొని దందా చేస్తుంటే బీరాలు పలికిన హైడ్రా కమిషనర్ గోమాతలు ఆశ్రయం పొందుతున్న కేంద్రాలను కూల్చివేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా నిర్మాణాలు కూల్చివేయడం అమానుషమని అన్నారు. దేవాలయాన్ని ఆనుకొని ఏర్పాటైన గోశాలను ఎలా కూలుస్తారని, రోడ్డున పడ్డ గోమాతల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మరో వర్గం వారి వ్యాపార కేంద్రాలను వదిలేసిన హైడ్రా హిందువుల ఆధ్యాత్మిక కేంద్రాలను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. గోశాలల విషయంలో హైడ్రా పునరాలోచించుకోవాలని హితవు పలికారు.






