శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు ఆధ్వర్యంలో దసరా సందర్భంగా సెప్టెంబర్ 23 వ తేదీ నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు పది రోజుల పాటు నాదబ్రహ్మోత్సవ్ 2025 ను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండవ రోజు సెప్టెంబర్ 24వ తేదీన సాయంత్రం ప్రముఖ సినీ నేపథ్య గాయని గాయత్రి నారాయణన్ తన సుమధుర గాత్రంతో శ్రీమన్నారాయణ, జయలక్ష్మి, గోవిందాశ్రిత, ఇందరికి అభయమ్ము, బ్రహ్మ కడిగిన, తిరుమల గిరిరాయ, తందనానా అహి, జ్యో అచ్యుతానంద అనే బహుళ ప్రాచుర్యం పొందిన సంకీర్తనలు సుస్వరంగా ఆలపించగా వీరికి కీ బోర్డు మీద రాజు, తబలా మీద అజయ్ వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్, అజయ్ శాంతి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ అన్నమాచార్య భావనా వాహిని సంస్థ ద్వారా అన్నమాచార్య సంకీర్తనల ప్రచారానికి గాను శోభారాజు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకొని చేస్తున్న కృషిని అభినందించారు. చివరిగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.






