శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి ఫెస్ట్ కార్యక్రమాలు దోహదం చేస్తాయని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున గ్రామర్ స్కూల్ Fun Fusion Fest ను అట్టహాసంగా నిర్వహించారు. విజ్ఞానం, వినోదం మేళవింపుగా సాగిన ఈ కార్యక్రమానికి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఫెస్ట్లో భాగంగా విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులు, కళాఖండాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ప్రతి స్టాల్ను సందర్శించి, విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నైపుణ్యాన్ని, వారి ఆలోచనా దృక్పథాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభ కనపరచిన విద్యారులకు బహుమతులను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





