శేరిలింగంపల్లి, ఏప్రిల్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్ వీకర్ సెక్షన్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చందానగర్ లోని స్మిత దంత వైద్యశాల సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత దంతవైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్మిత దంత వైద్యశాల వైద్యుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి పిల్లలకు దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, టూత్ పేస్టులు, బ్రష్ లు అందజేసిన అనంతరం మాట్లాడుతూ పిల్లలు ఎక్కువగా దంతక్షయం, దంతాల కోత, చిగుళ్ళ ఇన్ ఫెక్షన్, సూక్ష్మ క్రిములు లేదా బాక్టీరియా వలన దంతవ్యాధుల బారిన పడుతుంటారు. దీనికి కారణాలు చక్కెర అధికంగా ఉన్న ఆహారము తీసుకోవడం వలన, అధిక వేడి లేదా చల్లని పానీయాలు తీసుకోవడం వలన, దంతాలను సరిగా శుభ్రపరచక పోవడం మొదలైనవి. ప్రతి ఒక్కరూ ఉదయము, సాయంత్రము తప్పనిసరిగా రెండు పూటలా బ్రష్ చేసుకోవాలి. ఆహారం తిన్న వెంటనే నీటితో నోటిని పుక్కిలించి దంతాలను సంరక్షించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థవారు 1949 ఏప్రిల్ 7వ తారీఖునుండి ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టడం, చేపట్టవలసిన నివారణా చర్యలపై ప్రజలలో అవగాహన పెంచడంతో పాటు ఒక ప్రత్యేక నినాదంతో ఈ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరపు నినాదం ఆరోగ్యకరమైన ప్రారంభం – ఆశాజనక భవిష్యత్తు . ఈ థీముయొక్క ప్రధాన ఉద్దేశ్యం తల్లులు, నవజాత శిశువుల ఆరోగ్యం, మనుగడలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం. మాతా, శిశువుల సంరక్షణ, సంక్షేమము ప్రాముఖ్యతను నొక్కి చెప్పడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.