- కోవిడ్ మృతదేహాలను ఉచితంగా స్మశానవాటికలకు చేరవేస్తున్న వైనం…
- గతేడేది 220 పార్ధివ దేహాల తరలింపు… నేటి నుంచి సేవల పునః ప్రారంభం…
నమస్తే శేరిలింగంపల్లి: కరోనాతో మృతిచెందిన వారిని కన్నవారు, కడుపులో పుట్టినవారే పట్టించుకునే పరిస్థితి లేని నేటి తరుణంలో వారి పార్ధివ దేహాలను స్మశాన వాటికలకు తరలిస్తూ అంతిమ యాత్రలో ఆప్తులుగా మారిన ఫీడ్ ద నీడీ యువ బృందానికి సెల్యూట్ చెప్పాల్సిందే. గతేడాది కరోనా మొదలైన రోజుల్లో కోవిడ్తో మృతి చెందిన వారిని హాస్పిటల్స్ నుంచి స్మశాన వాటికలకు తరలించేందుకు అంబులెన్స్లు, మార్చురీ వ్యాన్లు సైతం ముందుకు రాకపోవడం, వచ్చినా రూ.25వేల నుంచి 50 వేల వరకు వసూలు చేసాయి. ఇది గమనించిన నగరానికి చెందిన కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు చలించిపోయారు. అప్పటికే ఫీడ్ ద నీడీ అనే సంస్థను స్థాపించి కోవిడ్ బాదితులకు సేవలందింస్తున్న సదరు బృందం గతేడాది జూలై 4న లాస్ట్రైడ్ పేరిట అంబ్యులెన్స్ను ఏర్పాటు చేసి కోవిడ్ మృతదేహాలను ఉచితంగా స్మశానవాటికలకు తరలించే సేవలకు పూనుకున్నది. డిసెంబర్ 31 వరకు మొత్తం 220 మృతదేహాలను స్మశాన వాటికలకు తరలించింది. పలు సందర్భంల్లో అంత్యక్రియలు చేయలేని నిరుపేద మృతదేహాలకు స్వంత ఖర్చుతో అంతేష్టి సైతం పూర్తి చేసి ఔదార్యాన్ని చాటింది ఫీడ్ ద నీడి బృందం.

యువత స్పూర్తిగా తీసుకోవాలి: సీపీ సజ్జనార్
కరోనా సెంకడ్ వేవ్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో పీడ్ ద నీడి బృందం తమ లాస్ట్ రైడ్ సేవలను పునః ప్రారంభించింది. సోమవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ లాస్ట్ రైడ్ ఆంబ్యులెన్స్ సేవలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో నిండు మనసుతో ఫీడ్ ద నీడీ బృందం సభ్యులు సాయితేజా, శ్రీనివాస్ బెల్లం, రమణజీత్ సింగ్, ప్రశాంత్, సురేంద్ర, వినయ్ వంగల, ప్రదీప్, రాకేష్, అనుమోద్లు మానవత్వాన్ని చాటుతున్నారని అన్నారు. మృతదేహాలను ఉచితంగా స్మశాన వాటికలకు తరలించడంలో ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయమని అన్నారు. యువత వారిని స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. సేవలు పొందాలను కునే వారు ఫోన్ నెంబర్ 7995404040 or 9490617440లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక డీసీపీ విజయ్కుమార్, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరి కృష్ణ యేదుల, సీఏఆర్ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ సంతోష్కుమార్, ఏసీపీ హనుమంతరావు, ఆర్ఐ మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
