శేరిలింగంపల్లి, జూన్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా మాదాపూర్ శిల్పారామంలో రెండవ రోజు వేడుకలు కళా వైభవంతో కొనసాగాయి. ఈ సందర్భంగా సృజన జాతీయ కల్చరల్ అండ్ లిటరరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంస్థ చైర్మన్ అంజనా చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నర్తన అర్ధనారీశ్వరం నృత్యాన్ని ప్రదర్శించగా, పల్లవి బృందం లావణి నృత్యంతో అలరించింది. వేదాంత బృందం కర్మ నృత్యం ప్రదర్శించగా, నిధి బృందం లంబాడా నృత్యంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

సంధ్యరాణి పవన్ బృందం పేరిణి లాస్యం, శైల నృత్యాలను ప్రదర్శించి మెప్పించింది. తెక్రం బృందం ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆకట్టుకోగా, రిత్విక్ వెంకట్, ఛార్మి వెంకట్లు సింహనందిని నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల నుంచి ఘనమైన అభినందనలు అందుకున్నారు. కార్యక్రమం అనంతరం అంజనా చౌదరి పాల్గొన్న కళాకారులందరినీ సత్కరించి అభినందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక శోభను చేకూర్చాయి.






