శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ప్రపంచ జలదినోత్సవ అవగాహనపై ముద్రించిన గోడ పత్రికను హైదరాబాద్ మహానగర జలమండలి డివిజన్ నెంబర్ 15 జనరల్ మేనేజర్ ఎం. బ్రిజేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి వారు ప్రతి సంవత్సరం మార్చి 22ను ప్రపంచ జలదినోత్సవంగా ప్రకటించి, దీనిపై వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ప్రకృతి ప్రసాదించిన నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు, భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి సంవత్సరం ఒక నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నినాదం హిమనదాల సంరక్షణ అని తెలిపారు.

రోజురోజుకీ భూతాపం పెరిగిపోతుంది. దీనికి కారణం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలతో పాటు, చెట్లను విరివిగా నరికి వేయడం, ప్లాస్టిక్ వినియోగం అధికమవడంతో పాటు పకృతి ప్రసాదించిన వనరులను విరివిగా వాడటం వలన, భూగర్భ జలాలు కలుషితం అవడం వల్ల పర్యావరణంలో పెను మార్పులు సంభవించి, మంచు కొండలన్నీ కరిగి సముద్ర జలాల్లో కలవడం, సముద్రమట్టం పెరగడంతో పాటు వరదలు, కరువులు, కొండ చరియలు విరిగిపడడం, దీనితో పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి అని అన్నారు. ప్రపంచ నాగరికత అంతా నదీ తీర పరీవాహక ప్రాంతాలలోనే ఇనుమడించింది అని అన్నారు. ఈ సందర్భంగా అందరి చేత నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీహరిబాబు, కౌండిన్యశ్రీ, నండూరి వెంకటేశ్వరరాజు, శివరామకృష్ణ, పాలెం శ్రీను, జనార్ధన్, బాలరాజు, సుధాకర్, యూసుఫ్, రామారావు, శివరామిరెడ్డి, జలమండలి అధికారులు నరేందర్ రెడ్డి, శరత్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.





