శేరిలింగంపల్లి, మార్చి 30 (నమస్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు చెట్లను పెంచాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. విశ్వవసు నామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకొని తన ఇంటి ఆవరణలో ఆయన నేరేడు మొక్కను నాటారు. అలాగే శిల్పా ఎన్క్లేవ్లో మునక్కాయల చెట్టును నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతా చెట్లను నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని అన్నారు. చెట్లను నాటితే అవి మనల్ని సంరక్షిస్తాయని అన్నారు. ప్రస్తుతం మానవుడు చేస్తున్న అనేక తప్పుల కారణంగా రోజు రోజుకీ పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.
రహదారులపైకి వస్తున్న వాహనాలతో కాలుష్యం పెరిగిపోతుందని దీంతో పర్యావరణం కలుషితం అవుతుందన్నారు. కాంక్రీట్ జంగిల్గా మారుతున్న నగరాలు, పట్టణాల కారణంగా కనుచూపు మేరలో చూద్దామంటే ఎక్కడా చెట్లు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లను రక్షించలేకపోతే భవిష్యత్ తరాలకు మనుగడ లేదన్నారు. మన భవిష్యత్తు తరాల వారికి చక్కని పర్యావరణం, ఆరోగ్యాన్ని అందించాలంటే మనం చెట్లను నాటాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నారులకు సైతం ఆ వయస్సు నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.