శేరిలింగంపల్లి, అక్టోబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో సారీస్ అఫ్ ఇండియా బతుకమ్మ, దసరా ఉత్సవాలు సందడిగా కొనసాగుతున్నాయి. టీకే సిస్టర్స్ డాక్టర్ సరోజ, డాక్టర్ సుజాతల సంగీత కచేరి అలరించింది. జ్యోత్స్నా శిష్య బృందంచే దేవీ స్తుతి వైభవం కూచిపూడి ప్రదర్శనలో మొదటగా బాల అమ్మవారి గురించి స్తుతిస్తూ నాట్యం చేశారు.

అనంతరం దసరా శరన్నవరాత్రులలో ఉన్న తొమ్మిది అమ్మవారి రూపాలను ధ్యానిస్తూ పలువురు వాగ్గేయకారులు రచించిన కీర్తనలను ఆలంబనగా చేసుకుని నాట్య ప్రదర్శన కొనసాగింది. చివరిగా మహిషాసురుడి అరాచకాలను రూపుమాపుటకు మహిషాసురమర్దిని అయి అమ్మ కదిలి వచ్చి మహిషాసురుని సంహరిస్తుంది. అనంతరం 9 రూపాలలో కొలువై ఉన్న జగన్మాత సందర్శనంతో ఈ ప్రదర్శన ముగిసింది. కళాకారులు మనస్వి, తేజస్వి, శరణ్య, అద్వైత, హాసిని, జ్యోతిక రెడ్డి పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన చేనేత చీరలు మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
