శేరిలింగంపల్లి, మార్చి 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి ఐటి జోన్లో అత్యంత కీలకమైన దుర్గం చెరువును స్వచ్ఛమైన నీటితో కళకళలాడేలా తీర్చిదిద్దాలని బల్దియా కమీషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. చెరువులోకి చేరే మురుగునీటికి పూర్తిగా చెక్ పెట్టి, వర్షపు నీరు వచ్చేలా పూర్తిస్తాయి వ్యవస్థను అభివృద్ధి పరచాలని అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని దుర్గం చెరువును జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ,జలమండలి ,ఎస్ ఎన్డిపి విభాగాల అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు .ఈ సందర్భంగా జలమండలి చేపట్టనున్న మురుగునీటి డైవర్షన్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో చర్చించారు . ఎస్ ఎన్ డి పి ఆధ్వర్యంలో చేపడుతున్న స్ట్రామ్ వాటర్ లైన్ పురోగతిని ఆయన పరిశీలించారు .
అనంతరం బల్దియా కమీషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ మురుగనీటిని దారి మళ్లించేలా పటిష్టమైన డ్రైనేజీల నిర్మాణానికి సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. భవిష్యత్తులోనూ మురుగునీటి పరిమాణాన్ని తట్టుకునేలా తగినంత మోతాదులో పైపుల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు .వర్షపు నీరు స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ ద్వారా చెరువులోకి చేరేలా పటిష్టమైన నాణ్యమైన నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు .దుర్గం చెరువు లో పరిశుభ్రమైన జలాలు నింపి ఆహ్లాదకరమైన పరిసరాలను నగర ప్రజానీకానికి అందించేలా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని కమీషనర్ తెలిపారు .పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జోనల్ కమిషనర్, సంబంధిత విభాగాల అధికారులను బల్దియా కమిషనర్ ఇలంబర్తి ఆదేశించారు.