శేరిలింగంపల్లి, మే 11 (నమస్తే శేరిలింగంపల్లి): వేసవి కారణంగా శేరిలింగంపల్లిలోని గుల్మోహర్ పార్క్ నేతాజీ నగర్ కాలనీలో నీటి ఎద్దడి సమస్య ఏర్పడిందని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతూ హఫీజ్పేట వాటర్ వర్క్స్ చీఫ్ మేనేజర్ కి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ కేవలం నేతాజీ నగర్ కాలనీలోనే కాకుండా నియోజకవర్గం వ్యాప్తంగా అనేక చోట్ల తాగునీటి సమస్య ఉందన్నారు. ప్రజలు వేసవి నేపథ్యంలో తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని, నీటి సౌకర్యం లేని చోట్ల ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేయాలని కోరారు. నీటి సరఫరా ఉన్న చోట్ల సరఫరాను పెంచాలని, ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల్లో ప్రెషర్ సరిగ్గా రావడం లేదని, ఆ సమస్యను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు, యువజన నాయకుడు చంద్రశేఖర్ యాదవ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.






