శేరిలింగంపల్లి, ఏప్రిల్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదల నివాస స్థలాలను పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని మానుకోవాలని నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నడిగడ్డ తండా వాసులు శేరిలింగంపల్లి మండల రెవెన్యూ కార్యాలయ ఆఫీసర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికంగా తాము 50 ఏళ్ల నుంచి నివసిస్తున్నామని, తామంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర మైనార్టీ వర్గాలకు చెందిన, వెనుకబడిన పేదవాళ్లమని తెలిపారు. స్థానికంగా చుట్టు పక్కల కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమను వేరే ప్రాంతానికి తరలిస్తే తమ జీవనోపాధికి తీవ్ర విఘాతం కలుగుతుందని, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి లబ్ధి కలగకపోయినా తమకు తామే జీవనోపాధి కల్పించుకుని జీవిస్తున్నామని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మరో ప్రాంతానికి తమను తరలించి గృహ నిర్మాణం జరిపి తమ జీవనోపాధికి ముప్పు కలిగించవద్దని, ప్రజా ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా తమకు ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లను నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని, ప్రతి లబ్ధిదారుడికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని కోరారు. తాము ప్రస్తుతం నివాసం ఉంటున్న స్థలాల్లోనే ఇళ్లను నిర్మించుకునేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోరారు.






