శేరిలింగంపల్లి, నవంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని చందానగర్ లోని PJR స్టేడియంలో ఉచిత మధుమేహ, రక్తపోటు, పల్స్ పరీక్షలను నల్లగండ్ల సిటిజన్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ 170 దేశాలలో మధుమేహ వ్యాధి వలన కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు, పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి సుమారు వంద కోట్ల ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతోందని, మధుమేహం మనం తీసుకునే ఆహారం నుండి ఉత్పత్తి అయ్యే గ్లూకోజును ప్రాసెస్ చేయడంలో, వినియోగించుకోవడంలో శరీరం విఫలమయ్యే రుగ్మతే డయాబెటిక్ వ్యాధి అని అన్నారు. మారుతున్న జీవనశైలి, పర్యావరణంలో వస్తున్న పెను మార్పుల కారణంగా దాదాపుగా ప్రతి కుటుంబంలో ఒక డయాబెటిక్ పేషెంటు ఉన్నారని, చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ వ్యాధి బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉందన్నారు. ఇది సైలెంట్ కిల్లర్ అని, శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతూ మనిషి ఆయుష్షును తగ్గిస్తూ ఉందన్నారు. ఈ వ్యాధి నివారణకు సమతుల్యమైన జీవనశైలిని పాటించాలని, పోషకాహారం తీసుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ప్రతిరోజు మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉమా చంద్రశేఖర్, జనార్ధన్, M S నారాయణ, శ్రీనివాస నాయక్, శంకర్, హాస్పిటల్ ప్రతినిధి జాకీర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.






