- దేశీయ పరిశోదన సంస్థల చిత్రాలతో మాక్జిమ్ పోస్ట్ కార్డుల ఆవిష్కరణ
నమస్తే శేరిలింగపల్లి: భాగ్యనగరంలోని ప్రముఖ శాస్త్రీయ పరిశోధన సంస్థలకు అరుదైన గౌరవం దక్కింది. నగరంలోని సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులర్ బయాలజీ (CCMB), ది నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT), సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ (CRIDA), ది సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC), నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (NAARM), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER), ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ – ఆరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) సంస్థలకు చెందిన చిత్రాలను పోస్టల్ శాఖ తమ పోస్ట్కార్డులపై ప్రచురించింది.

డాక్ సధన్లో జరిగిన డైరెక్టర్ల సమీక్ష సమావేశంలో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎస్ రాజేంద్ర కుమార్ సదరు మాక్జిమ్ పోస్టు కార్డులను ఆవిష్కరించారు. అదేవిధంగా రాణిపూర్, మదన్ మోహన్, బిష్ణుపూర్, జోర్ బంగ్లా ఆలయం, నెబియా ఖేరా, భద్వారా, లాల్జీ, కల్నా, లక్ష్మణ, సిర్పూర్, శ్యామ్ రాయ్ లాంటి టెర్రకోట ఆలయాలతో కూడిన మాక్జిమ్ కార్డులను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేంద్రకుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం దేశంలోని ప్రధాన శాస్త్రీయ పరిశోధన సంస్థలకు నిలయమని. అనేక ప్రపంచ ప్రఖ్యాత విద్యా మరియు పరిశోధనా సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో ఉన్నాయని, తద్వారా విస్తారమైన ప్రతిభ, నాణ్యమైన విద్య, ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ విలసిల్లుతుందని అన్నారు. ఈ క్రమంలోని ప్రముఖ సంస్థల చిత్రాలతో మాక్జిమ్ కార్డులను ఆవిష్కరించి వాటి గౌరవాన్ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ విభాగం అధికారులు పాల్గొన్నారు.