శేరిలింగంపల్లి, మే 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా యుద్ధప్రతిపాదకన చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ వరద నీటి కాల్వ నిర్మాణం పనులలో భాగంగా హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఆకస్మిత తనిఖీలో భాగంగా జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు డీఈ ఆనంద్, ఏఈ భాస్కర్ లతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కల్వర్ట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ లింగంపల్లి అండర్ బ్రిడ్జి వరద నీటితో నిండి పోవడం వలన పరిసర ప్రాంత వాహనదారులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎమ్మెల్యే గాంధీ చొరవతో అండర్ బ్రిడ్జి నుండి వరద నీటి కాల్వ, బాక్స్ కల్వర్ట్ నిర్మాణం పనులు చేపడుతున్నామన్నారు.
పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువవచ్చి ముంపు సమస్య పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం గోపీచెరువులో ఉన్న మురికి నీటిని తొలగించమని సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా డ్రైనేజీ నీరు చెరువులో నిలవకుండా ఉంటుందని, డ్రైనేజీ నీటి వల్ల చెరువులో గుర్రపుడెక్క పేరుకుపోయిందని దోమలబారి నుండి ఉపశమనమవుతుందని సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని హైడ్రా కమీషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. అందుకు రంగనాథ్ సానుకూలంగా స్పందిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైడ్రా సంబంధిత అధికారులు, సందయ్య నగర్ అధ్యక్షుడు బస్వరాజ్, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, నటరాజ్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.