శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (నమస్తే శేరిలింగంపల్లి): బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి ముర్రుపాలు పట్టడం బిడ్డకి అమృతంతో సమానమని ఐసీడీఎస్ శేరిలింగంపల్లి ఆదిత్యనగర్ సెక్టార్ సూపర్వైజర్ లోవకుమారి అన్నారు. తల్లిపాలే బిడ్డకి మొట్టమొదటి టీకా అని తెలిపారు. శనివారం న్యూహఫీజ్పేట మార్తాండనగర్, ప్రేమ్ నగర్ అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలను కచ్చితంగా ఇవ్వాలని అన్నారు. దాని వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా దృఢంగా, శారీరకంగా ఎదుగుదలకు తోడ్పడుతుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న గర్భిణీలకు సామూఖి శ్రీమంతాలు, ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన, 3 సంవత్సరాల లోపు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఏడీ సునంద, అంగన్వాడీ టీచర్లు లక్ష్మీ ప్రవీణ, నాగశ్రీలత, మణిజ్యోతి, ఖైరున్నీసా, కల్యాణి, శైలజ, లక్ష్మీకాంతం, షీబా, కాలనీ వాసులు పాల్గొన్నారు.






