శేరిలింగంపల్లి, మే 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఖానామెట్ సర్వే నంబర్ 7లో ఉన్న సుమారు 6 ఎకరాల 5 గుంటల ఈదులకుంట చెరువు భూమిని కబ్జా నుంచి కాపాడడంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పోరాటం కీలక పాత్ర పోషించిందని పార్టీ నాయకులు తెలిపారు. కోట్ల రూపాయల విలువైన చెరువు భూమిని సర్వే నెంబర్లను తారుమారు చేసి ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తించిన సిపిఐ నాయకులు, అక్కడ జరుగుతున్న సెల్లార్ తవ్వకాల పనులను అడ్డుకుని అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసి చెరువు భూమిని రక్షించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అవసరమైతే ధర్నాలు, ఆందోళనలు నిర్వహించి అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు.

అధికారుల నిర్లక్ష్యం ఉన్నప్పటికీ చివరకు హైడ్రా జోక్యంతో చెరువు భూమి రక్షించబడటం ఆనందకరమని సిపిఐ నాయకులు అన్నారు. చెరువును వెంటనే సుందరీకరించి, రానున్న వర్షాకాలంలో పూర్వ వైభవంతో నీటితో నింపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చెరువు పరిరక్షణ కోసం పోరాడిన ప్రజలు, రిపోర్టర్లు, కార్యకర్తలు, సహకరించిన ప్రతి ఒక్కరికీ సిపిఐ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు టి. రామకృష్ణ, సిపిఐ శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే. చందు యాదవ్, సిపిఐ జిల్లా సమితి సభ్యుడు కే. వెంకటస్వామి, కే. సుధాకర్, జెట్టి శ్రీనివాస్, కోన సుధాకర్, తుపాకుల రాములు, ఎస్. నారాయణ రఘు తదితరులు పాల్గొన్నారు.





