నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 14 లోని ఒక ఎకరా పది గుంటల ప్రభుత్వ పూర్తి నిల్వ సామర్ధ్యం స్థలం(ఎఫ్టీఎల్) వేలం వేయడాన్ని విరమించుకోవాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం శేరిలింగంపల్లి తహసిల్దార్ వంశీ మోహన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గోపన్ పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 14 లో గల ప్రభుత్వ స్థలంలో గోపన్ పల్లి, అపర్ణ సైబర్ కౌంటీ, అపర్ణ సరోవర్ నుంచి వచ్చే డ్రైనేజీ, వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. ఈ స్థలాన్ని వేలం వేయటం వల్ల ఈ ప్రాంతాల్లోని డ్రైనేజీ, వరద నీటి ప్రవాహం సమస్య అధికమై ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ప్రజా అవసరాలకు ఉపయోగపడే ఈ స్థలం వేలాన్ని వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
