శేరిలింగంపల్లి, మే 1 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతిరోజూ ఒక వార్డు (One Ward Every Day) కార్యక్రమంలో భాగంగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజన కూకట్పల్లి జోన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ సర్కిల్ హైదర్నగర్ వార్డులో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. పర్యటనలో భాగంగా కమిషనర్ రామ్ నరేష్ నగర్, ప్రశాంత్ నగర్, ఏఎస్ రాజు నగర్, ఆలీ తలాబ్ చెరువులను సందర్శించారు. స్థానిక నివాసితులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (RWA) ప్రతినిధులతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో ఉన్న పౌర సమస్యలను సమీక్షించారు. రామ్ నరేష్ నగర్ (రోడ్ నెం.1)లో రోడ్డు పనులను చేపట్టాలని, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమన్వయం చేసుకుని మురుగునీటి కాల్వల పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, HMWSSB చేపట్టిన అసంపూర్తి, నాసిరకం రోడ్డు పునరుద్ధరణ పనులపై పెనాల్టీలు విధించాలని ఆదేశించారు.

రోడ్ నెం.3లో ఉన్న ఆక్రమణలను తొలగించాలని, అంతర్గత రహదారులపై వదిలివేసిన పాత వాహనాలను క్లియర్ చేయాలని సూచించారు. నీటిపారుదల శాఖతో సమన్వయం చేసుకుని చెరువులోకి మురుగునీరు చేరకుండా మళ్లించాలని, చెరువు గట్టు పటిష్టం చేయడం, వాకింగ్ ట్రాక్ను అభివృద్ధి చేయాలని, చెరువు మెరుగైన నిర్వహణ కోసం లేక్ కమిటీని ఏర్పాటు చేయాలని, రెవెన్యూ, నీటిపారుదల శాఖల సమన్వయంతో కాంపౌండ్ వాల్ నిర్మించాలని, ప్రశాంత్ నగర్ (ఓల్డ్ ఏజ్ హై టెన్షన్ రోడ్) వద్ద రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అన్నారు.





