శేరిలింగంపల్లి, జూలై 9 (నమస్తే శేరిలింగంపల్లి): వన్ డే, వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్తోపాటు వివిధ శాఖల అధికారులు కుత్బుల్లాపూర్ జోన్లోని గాజులరామారం సర్కిల్ పరిధి గాజులరామారం వార్డును సందర్శించారు. ఈ సందర్భంగా రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు, స్థానిక నివాసితులతో సమావేశమై క్షేత్రస్థాయిలో పౌర సమస్యలను సమీక్షించారు.

సమావేశంలో సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, ఫంక్షన్ హాల్ నిర్మాణం, పార్కుల అభివృద్ధి, చెట్ల కొమ్మల తొలగింపు, చెరువు పరిసరాల పరిరక్షణ, రహదారులు, ప్రజా స్థలాలపై ఆక్రమణల తొలగింపు, పారిశుద్ధ్య సేవల మెరుగుదల, సి & డి వ్యర్థాల తొలగింపు, వర్షాకాలంలో దోమల నివారణ చర్యలు, ఆస్తి పన్ను, తాగునీటి సరఫరా, పెండింగ్ భూగర్భ డ్రైనేజీ పనులు, వీధి కుక్కల నియంత్రణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. వార్డులో గుర్తించిన అన్ని సమస్యలను సంబంధిత శాఖలు అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. అన్ని లైన్ డిపార్ట్మెంట్లు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.





