శేరిలింగంపల్లి, ఆగస్టు 14 (నమస్తే శేరిలింగంపల్లి): రోడ్లు, ఫుట్పాత్లు, ప్రజా ప్రదేశాలను ఆక్రమణల నుంచి విముక్తం చేసేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) చేపడుతున్న వాక్ ఫ్రీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా మూడు జోన్ల పరిధిలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో 12.45 కిలోమీటర్ల మేర 345 ఆక్రమణలను తొలగించారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలో గుర్తించిన ప్రాంతాల్లో సీఎంసీ బృందాలు ఆక్రమణలను తొలగించి, రోడ్లు, ఫుట్పాత్లు, ప్రజా ప్రదేశాలను తిరిగి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. శేరిలింగంపల్లి జోన్ లో అమీన్పూర్ 8, మియాపూర్ 28, శేరిలింగంపల్లి 80 మొత్తం కలిపి 4.5 కి.మీ పరిధిలో 116 ఆక్రమణలు తొలగించారు.

కూకట్పల్లి జోన్ లో మాదాపూర్ 23, ఆల్విన్ కాలనీ 10, కూకట్పల్లి 20, మూసాపేట 15 మొత్తం కలిపి 3.35 కి.మీ పరిధిలో 68 ఆక్రమణలు తొలగించారు. కుత్బుల్లాపూర్ జోన్ లో చింతల్ 13, జీడిమెట్ల 38, కొంపల్లి 32, గాజుల రామారం 21, నిజాంపేట 17, దుండిగల్ 22, మేడ్చల్ 18 మొత్తం కలిపి 4.6 కి.మీ పరిధిలో 161 ఆక్రమణలు తొలగించారు. తొలగించిన ప్రాంతాల్లో మళ్లీ ఆక్రమణలు ఏర్పడకుండా సీఎంసీ బృందాలు నిరంతరం పర్యవేక్షించనున్నాయి. రోడ్లు, ఫుట్పాత్లు ప్రజలకు సురక్షితంగా, అందుబాటులో ఉండేలా చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో రోడ్లు, ఫుట్పాత్లను ఆక్రమణలు లేకుండా ఉంచడమే లక్ష్యంగా వాక్ ఫ్రీ కార్యక్రమాన్ని ప్రతి వారం కొనసాగిస్తున్నారు.





