శేరిలింగంపల్లి, డిసెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): హెచ్సీఏ ఇంటర్ స్కూల్స్ అండర్ 14 నాకౌట్ టోర్నమెంట్లో గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థి చేతన్ ఆదిత్య సత్తా చాటాడు. 50 ఓవర్ల మ్యాచ్లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసిన గౌతమ్ మోడల్ స్కూల్ జట్టు 6 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థి చేతన్ ఆదిత్య 108 పరుగులతో ఆకట్టుకున్నాడు. 118 బంతుల్లో 13 ఫోర్లతో అతను 108 పరుగులు చేశాడు. అలాగే మరో ఇద్దరు ప్లేయర్లు లక్ష్మణ్ (38), మోసెస్ పాల్ (31) కూడా ఫర్వాలేదనిపించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం జట్టు 49.4 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు ప్లేయర్లలో అర్జున్ (63), శౌర్య (86) రాణించారు. గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థి లక్ష్మణ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. 40 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. గౌతమ్ మోడల్ స్కూల్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా ఈ మ్యాచ్లో సెంచరీతో సత్తా చాటిన చేతన్ ఆదిత్యను కోచ్ రవి అభినందించారు.






