శేరిలింగంపల్లి, మే 7 (నమస్తే శేరిలింగంపల్లి): భారత్, పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పౌరులను అన్ని సమయాల్లోనూ అప్రమత్తంగా ఉంచేందుకు గాను దేశవ్యాప్తంగా గత 2 రోజులుగా పలు చోట్ల మాక్ డ్రిల్స్ను నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే చందానగర్లోనూ పౌరులకు భద్రతపై అవగాహన కల్పించేందుకు గాను స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.

నల్లగండ్ల లోని అపర్ణ నియో మాల్, అదేవిధంగా లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద చందానగర్ సీఐ సుంకరి విజయ్ నేతృత్వంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ఈ డ్రిల్లో భాగంగా పౌరులకు అవగాహన కల్పించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శాంతి భద్రతలకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
