కార్పొరేట్ దోపిడీకి కేంద్రం దాసోహం: పానుగంటి పర్వతాలు

శేరిలింగంప‌ల్లి, మే 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దేశ ప్రజలపై మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల భారం మోపుతూ కేంద్రంలోని ప్ర‌ధాని మోడీ ప్రభుత్వం యావత్ భారతదేశ ప్రజలను నట్టేట ముంచాలని చూస్తోందని, సిపిఐ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంద‌ని పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు అన్నారు. పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్యవర్గ సమావేశంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ ఇంధన ధరల పెంపు సామాన్య ప్రజల నడ్డి విరిచే చర్యగా మారింద‌న్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణా ఛార్జీలు పెరిగి కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు అన్ని వస్తువుల ధరలు అమాంతం పెరుగుతున్నాయ‌ని, రైతులు వ్యవసాయ పనులకు ఉపయోగించే డీజిల్ భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, ఆటో కార్మికులు, లారీ డ్రైవర్లు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు జీవన సంక్షోభంలోకి నెట్టబడుతున్నార‌ని అన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం ధరలను తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా వ్యవహరించడం దారుణమ‌ని, ప్రజల రక్తాన్ని పీల్చి కార్పొరేట్ మిత్రులకు దోచిపెట్టే విధానాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంద‌ని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మరిచిపోయి అచ్చే దిన్ పేరుతో ప్రజలను మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పన్నుల పేరుతో ప్రజల జేబులు ఖాళీ చేస్తోంద‌న్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని సిపిఐ డిమాండ్ చేస్తోంద‌న్నారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరుస్తూ పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి రామకృష్ణ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కె వెంకటస్వామి, సిపిఐ శేరిలింగంపల్లి కార్యదర్శి చందు యాదవ్, కే ఖాసీం, జటి శ్రీనివాస్, బి.నారాయణ, ఎం.వెంకటేష్, నరసమ్మ, చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here