నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలపై అవలంబిస్తున్న కక్షపూరిత వైఖరి సరికాదని, గత 30 సంవత్సరాలుగా నివాసముంటూ కరెంటు బిల్లు, నల్లాబిల్లు, ఇంటి నెంబరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు హక్కును ఇదే అడ్రస్ మీద కలిగి ఉన్న స్థానికుల ఇళ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ధ్వంసం చేయటం అమానుషమైన చర్య అని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ తప్పుబట్టారు. బిజెపి రంగారెడ్డి జిల్లా (అర్బన్) పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులతో కలిసి గౌలిదొడ్డి బసవతారక నగరవాసులను గురువారం రవికుమార్ యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు కనీసం నిలువ నీడ లేకుండా చేయడంతో పాటు ఎలాంటి వసతులు కల్పించకుండా రోడ్డున పడేయడం దారుణమన్నారు. కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని కేటీఆర్ అండ్ కో కంపెనీకి కట్టబెట్టాలని చూడడం సరికాదన్నారు. కూల్చిన పేదల ఇళ్లకు నష్టపరిహారం కల్పిస్తూ వీరికి ఉన్నచోటనే ఇళ్ల పట్టాలను గాని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేసే వరకూ భారతీయ జనతా పార్టీ న్యాయ పోరాటం చేయనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జల యోగానంద్, బుచ్చి రెడ్డి, గోవర్ధన్ గౌడ్, రాధాకృష్ణ యాదవ్, ప్రభాకర్ యాదవ్,మధు యాదవ్, హనుమంతు నాయక్, నర్రా విజయలక్ష్మి, పద్మ, రేణుక, తదితరులు పాల్గొన్నారు.
