మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్లోని శిల్పారామంలో ఆలిండియా క్రాఫ్ట్స్ మేళా కొనసాగుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు, చేతి వృత్తుల వారు తమ కళాకృతులను, వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. పెంబర్తి బ్రాస్, మెటల్ ఆర్ట్ వర్క్, కాపర్ మెటల్, మార్బుల్ ఆర్ట్ వర్క్, మధుబని పెయింటింగ్ తదితర అలంకరణ ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఆకట్టుకుంటున్నాయి.

మేళాలో భాగంగా మంగళవారం శిల్పారామంలోని ఆంఫి థియేటర్ లో వైదేహి సుభాష్ శిష్య బృందంచే నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన వీక్షకులను ఎంతగానో అలరించింది. పుష్పాంజలి, తొడయం, జతిస్వరం, శివమ్, శబ్దం, నటేశ కౌతం, అంబస్తుతి, ఆంగికం, భోశంభో, మంగళాష్టకం, వందేమాతరం తదితర అంశాలను ప్రదర్శించారు.
