శేరిలింగంపల్లి, జనవరి 23 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ రిజర్వేషన్స్ అచీవ్మెంట్ కోఆర్డినేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సెమినార్లో శాసనసభలు, పార్లమెంట్లో ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, ఓబీసీ వ్యవహారాల కోసం ప్రత్యేకంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్లు గట్టిగా వినిపించాయి. ఈ సెమినార్ను ఉద్దేశించి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, దేశ జనాభాలో మెజారిటీగా ఉన్న ఓబీసీలు రాజకీయ నిర్ణయాత్మక వ్యవస్థల్లో తగిన ప్రాతినిధ్యం లేకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఓబీసీలకు శాసనసభలలో రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని తీసుకువచ్చే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ అదనపు కలెక్టర్ రాజేశం, సీనియర్ వైద్యురాలు డా. రమాదేవి, తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటస్వామి, జాతీయ బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజేష్ యాదవ్, వెంకటరమణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ఓబీసీ నాయకులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఓబీసీల సామాజిక, విద్యా, రాజకీయ అభివృద్ధి, శాసనసభల్లో రిజర్వేషన్ల లేమి, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై విస్తృతంగా చర్చించారు. కుమారస్వామి మాట్లాడుతూ, ఓబీసీల సంక్షేమం, విధానాల రూపకల్పన, ప్రాతినిధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ అత్యవసరమని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఓబీసీల రాజకీయ చైతన్యం పెరుగుతోందని, ఇది రాజ్యాంగ హక్కులు, సామాజిక న్యాయం పట్ల అవగాహన పెరిగినదానికి నిదర్శనమని తెలిపారు.
ఓబీసీలకు శాసనసభల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి, న్యాయపరమైన ఆటంకాలు లేకుండా ఉండేందుకు దాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది చేయకపోతే దేశవ్యాప్తంగా ఓబీసీ సంఘాల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు గడిచినా కేంద్ర స్థాయిలో ఓబీసీలకు ప్రత్యేక సంస్థాగత ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఓబీసీల సమస్యలను నిర్లక్ష్యం చేసే రాజకీయ పార్టీలకు ప్రజల్లో ఆదరణ తగ్గే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ఈ సెమినార్ చివరలో దేశవ్యాప్తంగా ఓబీసీ సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని, శాసనసభల్లో రిజర్వేషన్లు, విస్తృత సామాజిక న్యాయం సాధించే వరకు సమిష్టిగా పోరాటం కొనసాగించాలని తీర్మానించారు.





