శేరిలింగంపల్లి, డిసెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీపై బీసీ సంఘాల్లో ఆగ్రహం ఉధృతమైంది. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టె విజయకుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్ మాట్లాడుతూ అగ్రకుల పార్టీలు బీసీల రాజకీయ జీవితాలను అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడే జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో కనీసం 17 శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వలేకపోవడం బీసీలను మోసం చేసినట్టే అన్నారు. బీసీల ఓటు కోరే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని ఫ్రంట్ నాయకులు ఫైరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్. దుర్గయ్య గౌడ్, బైరు శేఖర్, వి. నాగభూషణం, సింగం నగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






