శేరిలింగంపల్లి, మార్చి 31 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంకు వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో భూముల వేలాన్ని ఆపాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు జేసీబీని అడ్డుకుంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనను విచ్చిన్నం చేసి అక్రమ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని అరెస్ట్ చేసిన విద్యార్థి సంఘం నాయకులను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమించుకొని వేలం వేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడిదారుల దాహం తీర్చేందుకే భూముల అమ్మకానికి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూమిని ఎరగా చూపి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టుపెట్టే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.
యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా భూములనే కొల్లగొట్టేందుకు సిద్ధమైతే భవిష్యత్తులో యూనివర్సిటీల ఉనికి ప్రమాదకరంగా మారనుంది. ప్రభుత్వాల నుండి ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితిలను గమనించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు భవిష్యత్తులో ప్రయోగశాలలకు అవసరమైన భూములు చేజారిపోతే భవిష్యత్ తరాల విద్యార్థులకు యూనివర్సిటీ ఉనికికి ప్రమాదమని న్యాయబద్ధంగా భూముల రక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కి అక్రమ అరెస్టులకు పాల్పడుతుంది. కెసిఆర్ ను తలపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. ఇలాంటి నియంతృత్వ విధానాలను కొనసాగించిన కేసీఆర్ ను గద్దె దింపి కాంగ్రెస్ ను అధికార పీఠాన్ని ఎక్కిస్తే విద్యార్థులని చూడకుండా పోలీసులతో దుశ్చర్యాలను కొనసాగిస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అక్రమ అరెస్టును పిడియస్యూ తీవ్రంగా ఖండిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి పోలీసులు వెనకకు వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. భూముల అమ్మకాన్ని విరమించుకోవాలి. లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు.