శేరిలింగంపల్లి, మే 12 (నమస్తే శేరిలింగంపల్లి): 617వ అన్నమయ్య జయంతి సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో చిక్కడపల్లి లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుండి ట్యాంక్ బండ్ మీద ఉన్న అన్నమయ్య విగ్రహం వరకు వేంకటేశ్వర స్వామి, అన్నమయ్య వారి అర్చా మూర్తులతో పాటు చేరుకుని అక్కడ మహా నగర సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా శోభారాజు, ఆమె శిష్యులు సంయుక్తంగా తొలుత హరి యవతారమీతడు, బ్రహ్మమొక్కటే పర, వేడుకొందామా అనే అన్నమయ్య సంకీర్తనలను భక్తి రంజకంగా ఆలపించి అనంతరం స్వామివారికి అన్నమయ్య అష్టోత్తర శతనామావళి (పుష్ప పూజ) అర్పించారు.
అన్నమయ్య వేషధారణను మానస పటేల్, శ్రీ వేంకటేశ్వర స్వామి వేషధారణను సాందీప్ వేశారు. కాగా డా శోభా రాజు రచించి, స్వర పరచిన ఎక్కడున్నావ్ ఓ కల్కి దేవా! మనసారా నిను జూడ కదలి రావా! అంటూ ఒక ప్రత్యేక సంకీర్తన పాడారు. గౌరవ అతిథులు మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామియే కల్కి, ఆయన ఖడ్గమే (శ్రీ నందకమే) అన్నమయ్య అని, శోభా రాజు చేస్తున్న అన్నమయ్య యజ్ఞం రానున్న సమాజానికి ఎంతో మేలు చేకూరుస్తుందని తెలిపారు. శిష్యులు, భక్తులు విచ్చేసిన ఈ జయంతి వేడుకకు చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి, అన్నమయ్యకు హారతి అందించి భోజన ప్రసాద వితరణ గావించారు.