శేరిలింగంపల్లి, ఏప్రిల్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): న్యాయవాది అనేది కేవలం వృత్తి కాదని, అది సమాజానికి న్యాయం అందించే ఒక పవిత్ర సేవ అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. కూకట్ పల్లి బార్ (కోర్ట్) అసోసియేషన్ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కనకమామిడి సురేందర్ గౌడ్ ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తాను హై కోర్టు అడ్వకేట్ గా ఉన్నప్పుడు సీనియర్ న్యాయవాదుల నుంచి నేర్చుకున్న విషయాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ న్యాయం కోసం నిలబడే ప్రతి అడ్వకేట్ సమాజానికి మార్గదర్శి అని, సమాజంలో బలహీన వర్గాలకు న్యాయం అందించడంలో అడ్వకేట్ పాత్ర అమూల్యమని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే స్తంభాలలో న్యాయవాదులు ఒకరు అని అన్నారు. అడ్వకేట్ అనేది కేవలం ఒక వృత్తి కాదని, అది న్యాయం కోసం చేసే ఒక పవిత్ర సేవ అని గుర్తుచేశారు. కోర్టులో నిలబడి సత్యానికి స్వరం ఇచ్చే వ్యక్తి అడ్వకేట్ అని, నిర్దోషులను రక్షించి, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం ఆయనలో ఉంటుందని కొనియాడారు.






