శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 48 పిటిషన్లు అందాయి. పౌర సేవలు, వివిధ సమస్యలు, విజ్ఞప్తులను ప్రజలు సీఎంసీ కమిషనర్ సృజనకు నేరుగా వివరించారు. కమిషనర్ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను విని, సంబంధిత అంశాలను పరిశీలించారు. అందిన 48 పిటిషన్లలో టౌన్ ప్లానింగ్కు 41, ఇంజినీరింగ్కు 5, అడ్మినిస్ట్రేషన్కు 1, అర్బన్ బయోడైవర్సిటీకి 1 చొప్పున ఉన్నాయి.

ప్రతి పిటిషన్కు ప్రత్యేక గ్రీవెన్స్ ఐడీ, ట్రాకింగ్ లింక్ నమోదు చేశారు. దీంతో తమ ఫిర్యాదు ఏ దశలో ఉందో, పరిష్కార ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో ప్రజలు తెలుసుకునే అవకాశం కల్పించారు. అందిన ప్రతి పిటిషన్ను సంబంధిత విభాగాధిపతులు (HoDs) పరిశీలించి, నిర్దేశిత గడువులో అవసరమైన చర్యలు చేపట్టి సకాలంలో పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.





