నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్ కాలనీలో రోడ్డు నంబర్ 25, 26, 27లోని పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై స్థానిక నాయకులు కాలనీ వాసుల తో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీప్తిశ్రీనగర్ కాలనీలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. కాలనీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రోడ్లు డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీత రామయ్య, చంద్రశేఖర్ రావు, సుధాకర్, వెంకటేశ్వరావు, కోటేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
