దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగ్ కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. ఇకపై ఆర్టీజీఎస్ సేవలు 24 గంటలూ లభ్యం కానున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సోమవారం నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో బ్యాంకింగ్ కస్టమర్లు రోజులో ఎప్పుడైనా సరే ఆర్టీజీఎస్ ద్వారా నగదును ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
ఆర్టీజీఎస్ ద్వారా కనీసం రూ.2 లక్షలను పంపాలి. గరిష్టంగా లిమిట్ లేదు. ఎంతైనా పంపించుకోవచ్చు. ఆర్టీజీఎస్ సేవలను 24 గంటలూ అందిస్తున్నందున వ్యాపారులకు, పారిశ్రామిక రంగానికి ఎంతగానో మేలు జరుగుతుందని ఆర్బీఐ భావిస్తోంది.
కాగా ఇప్పటికే నెఫ్ట్ సేవలను కూడా రోజుకు 24 గంటలపాటూ అందిస్తున్నారు. అయితే నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలను వాడుకున్నందుకు ఎలాంటి చార్జిలను వసూలు చేయడం లేదు. 2019 జూలైలో ఆర్బీఐ నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలకు చార్జిలను వసూలు చేయకూడదని చెప్పింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ అప్పట్లో ఆ నిర్ణయం తీసుకుంది.