నమస్తే శేరిలింగంపల్లి: శ్రీరాముడి భక్తుల కోసం పోస్టల్ శాఖ వినూత్న సేవలను తీసుకువచ్చింది. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాల్లో పాల్గొనలేని భక్తుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సీతారాముల కల్యాణ మహోత్సవంలోని ముత్యాల తలంబ్రాలను మహా ప్రసాదంగా భక్తులకు చేరవేసుందుకు పోస్టల్ శాఖ వినూత్నంగా ఆన్లైన్ సేవలను తెరపైకి తీసుకొచ్చింది. వెబ్సైట్ లింక్ https:/telanganapostalcircle.in/eshop లోకి వెళ్లి ఆన్లైన్లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ ప్రసాదంను బుక్ చేసుకుంటే ఈనెల 21న శ్రీరామ నవమినాడు భద్రచాలంలోని అంతరాలయంలో వారి పేరిట అర్చన జరుపడంతో పాటు ముత్యాల తలంబ్రాలను నేరుగా ఇంటికి పంపిస్తారు. ఇందుకోసం రూ.300 రుసుం(పోస్టల్ చార్జీలు కలుపుకొని) చెల్లించాల్సి ఉంటుంది. ఈ అవకాశం సోమవారం(19-04-2021) వరకు అందుబాటులో ఉంటుందని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారు సమీప పోస్టాఫీస్లో నేరుగా వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చని, తెలంగాణ రాష్ట్రంలోని శ్రీరాముడి భక్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.