శేరిలింగంపల్లి, జూలై 29 (నమస్తే శేరిలింగంపల్లి): వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ట్యాంకర్ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పుప్పాల్గూడలోని బీఆర్సీలో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇవ్వూరి షాలిని (34) జూలై 29వ తేదీన ఉదయం దర్గా ఎక్స్ రోడ్డు వద్ద తన పిల్లలను స్కూల్ బస్సు ఎక్కేందుకు తన స్కూటీపై విడిచిపెట్టింది. అక్కడి నుంచి మణికొండ సుందర్ గార్డెన్స్ సమీపంలోకి రాగానే రోడ్డుపై ఒక్కసారిగా వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ (TS12UC8757) ఆమె ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆమె తల నుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






