శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనగా అతను తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 24వ తేదీన ఉదయం 4.25 గంటల సమయంలో లింగంపల్లి నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే రహదారి మధ్యలో మదీనాగూడ బస్ స్టాప్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా అదే సమయంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతని వివరాలు తెలియవని, ఎవరైనా గుర్తు పట్టదలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.






