మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మియాపూర్ పీఎస్ ఎస్ఐ రవికిరణ్ తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్లోని ఓల్డ్ హఫీజ్పేట సాయినగర్కు చెందిన వ్యాపారి షేక్ గౌస్ కుమారుడు షేక్ ఇబ్రహీం (20) స్థానికంగా ఉన్న ఓ ప్లైవుడ్ స్క్రాప్ షాప్లో పనిచేస్తున్నాడు. కాగా ఈ నెల 28వ తేదీన రాత్రి ఇబ్రహీం పని ముగించుకుని ఇంటికి రాలేదు. దీంతో అతను షాప్లోనే నిద్రించి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కాగా మరుసటి రోజు.. అంటే.. 29వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో షేక్ గౌస్ తన కుమారుడు షేక్ ఇబ్రహీం ఫోన్కు కాల్ చేయగా అతను కాల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అతను తన చిన్న కుమారుడు షేక్ ఇంతియాజ్ను షేక్ ఇబ్రహీం వద్దకు పంపించాడు. ఈ క్రమంలో ఇంతియాజ్ తన సోదరుడు పనిచేస్తున్న షాపు వద్దకు ఉదయం 7 గంటలకు చేరుకుని డోర్ను ఓపెన్ చేసేందుకు యత్నించాడు. కానీ తెరుచుకోలేదు. దీంతో తలుపులు పగలగొట్టి చూడగా లోపల ఇబ్రహీం పైకప్పుకు టైర్తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని షేక్ గౌస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికీ తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఇబ్రహీం ప్రేమ సంబంధ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.






