- ఆత్మ గౌరవ భవనాల స్థలం మారిస్తే సహించేది లేదు: శేఖర్ సగర
- సమస్య పరిష్కారానికి కృషి చేస్తా: బస్వరాజ్ సారయ్య
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ బిసి ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా అవార్డ్స్ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుక సత్యం సగరకు మాజీ మంత్రి, శాసన మండలి సభ్యుడు బస్వరాజు సారయ్య చేతుల మీదుగా అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర, ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకట్రాములు సగర, కోశాధికారి రామస్వామి సగరలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చాక ఫెడరేషన్లకు బడ్జెట్ ఇవ్వకపోవడం విచారకరమన్నారు. కోకాపేటలో ఆత్మ గౌరవ భవనాల పేరుతో ఇచ్చిన స్థలాన్ని మార్చడానికి కొందరు అధికారులు కుట్రలు చేస్తున్నారని, ముందు ఇచ్చిన ప్రకారం కొనసాగించకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి, శాసన మండలి సభ్యుడు బస్వరాజ్ సారయ్య స్పందిస్తూ సగరులకు అవమానం, అన్యాయం జరగకుండా చూస్తానని, అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.