శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్లో ఓ ప్రముఖ జ్యువెల్లర్ షాపులో చోరీ జరిగింది. కొందరు దుండగులు ఆయుధాలతో వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్లోని ఖజానా జ్యువెల్లర్స్ షోరూంలో మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు ఆయుధాలతో వచ్చి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కాలుకు బుల్లెట్ తగిలి గాయాలు అయ్యాయి. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. సదరు వ్యక్తులు షోరూంలో ఉన్న వెండి ఆభరణాలను చోరీ చేసి అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షోరూం యజమానుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్న వివరాలు తెలియాల్సి ఉందని, ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు.






