భార్య భర్తల గొడవలో చిన్నారి బలి

మియాపూర్: భార్యభర్తల గొడవలో మూడేళ్ళ చిన్నారి బలైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతుర్ని ఓ తండ్రి పాశవికంగా కర్రతో కొట్టడంతో తట్టుకోలేని చిన్నారి ప్రాణాలు విడిచింది. హృదయవిధారకమైన ఈ సంఘటనకు సంబందించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం…మియాపూర్ టేకు నర్సింహనగర్ లో నివాసం ఉండే వారణాసి దుర్గమ్మ, ఆడివయ్య దంపతులు చెత్త రిక్షా తొలతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి తమ నందిని, సునీత(3)లు సంతానం. కాగా గురువారం పనికి వెళ్లిన దుర్గమ్మ తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. అదే సమయానికి తాగి ఇంటికి వచ్చిన ఆడివయ్య దుర్గమ్మతో గొడవ పడ్డాడు. దుర్గమ్మ అత్త కూడా ఆమెను తిట్టడంతో విసుగు చెందిన దుర్గమ్మ పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. ఇద్దరు కూతుళ్లు నందిని, సునీతలను వెంటబెట్టుకుని బయలుదేరిన దుర్గమ్మ అదే బస్తీలోని పస్తం మాసయ్య ఇంటి వద్దకు చేరుకోగానే ఆడివయ్య వారిని అడ్డగించి దుర్గమ్మను ఇంటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. దుర్గమ్మ నిరాకరించడంతో పెద్ద కూతురు సునీతని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా సునీత కూడా నిరాకరించడం తో కోపోద్రిక్తుడైన ఆడివయ్య సెంట్రింగ్ కర్రతో కూతురి తలపై బలంగా కొట్టాడు. దీంతో సొమ్మసిల్లిపోయిన సునీతను ఓ ప్రయివేటు దవాఖానకు తరలించగా అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. చిన్నారి తల్లి దుర్గమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆడివయ్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.