నమస్తే శేరిలింగంపల్లి: అజాగ్రత్త, అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న ఇద్దరు కూలీలను ఢీకొట్టగా తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. మాదాపూర్ పోలీసుల వివరాల ప్రకారం శనివారం సాయంత్రం పర్వత్ నగర్ ఆటో స్టాండ్ వైపు నుంచి పర్వత్ నగర్ సిగ్నల్ వైపు బంజారాహిల్స్ ఎలక్ట్రిసిటీ డీఈ నరేందర్ రెడ్డి TS09EL9696 నంబరు గల స్విప్ట్ కారును అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ ఇంద్ర విల్లాస్ యూ టర్న్ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు కూలీలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలవగా మరొకరు స్వల్ప గాయాలకు గురయ్యారు. గాయాలపాలైన వారిని నరేందర్ రెడ్డి అదే కారులో మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించి మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. తీవ్ర గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. నరేందర్ రెడ్డి పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మృతుని వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు.

.





