శేరిలింగంపల్లి, మార్చి 29 (నమస్తే శేరిలింగంపల్లి): ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు మియాపూర్, మాదాపూర్, ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజస్థాన్కు చెందిన బిల్డర్ సురేష్ గవల (46), మియాపూర్కు చెందిన మాదిశెట్టి అజయ్ (46), రాజస్థాన్కు చెందిన జీత్ శర్మ (30), మాదిశెట్టి అజయ్ భార్య మాదిశెట్టి సంధ్య (40), బోసిబోయిన సోమనాథ్ (28), బీర గణేష్ కుమార్ (31) అనే వ్యక్తులు క్రిక్ 24/7, నైస్ 7777, యోప్ 2020 అనే యాప్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్వోటీ, మాదాపూర్, మియాపూర్ పోలీసులు కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ మేరకు వారి నుంచి రూ.53వేల నగదు, 5 మొబైల్ ఫోన్లు, హుండాయ్ ఐ20 కార్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.20,60,603 నగదును సీజ్ చేశారు. 7 మంది నిందితుల్లో సురేష్, అజయ్ పరారీలో ఉండగా మిగిలిన 5 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.