హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను నమ్మించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డ ఓ వ్యక్తికి న్యాయమూర్తి 7 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.25వేల జరిమానా విధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం కొల్తూరు గ్రామంలో కార్పెంటర్గా పనిచేసే గనాజి శ్రీనాథ్ (32) అదే గ్రామానికి చెందిన ఓ బాలిక (17)కు మాయమాటలు చెప్పాడు. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఈ క్రమంలో ఆమెను 2016 డిసెంబర్ 17వ తేదీన సిద్దిపేటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక అతని నుంచి తప్పించుకుని స్వగ్రామానికి చేరుకుంది. అయితే అప్పటికే బాలిక కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితున్ని అరెస్టు చేసి వారు పలుమార్లు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ కేసులో గనాజి శ్రీనాథ్ దోషి అని తేలడంతో ఎల్బీనగర్ 11 అడ్జెసెంట్ కోర్ట్ న్యాయమూర్తి ఆర్.రఘునాథ్ రెడ్డి అతనికి 7 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.25వేల జరిమానా విధించారు. ఈ క్రమంలో నిందితున్ని పోలీసులు శిక్ష నిమిత్తం జైలుకు తరలించారు.